పారదర్శకంగా సన్న బియ్యం పంపిణీని అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, 2.4.2025
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి తో కలిసి సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చౌకధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా చూడాలని చెప్పారు. మండలంలో ఖాళీగా ఉన్న అన్ని చౌక ధర దుకాణాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ను ఆదేశించారు . రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని , కొత్త రేషన్ కార్డులకు మీ -సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, రేషన్ కార్డులో పేర్లను సైతం మీ- సేవ కేంద్రాలద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను తామె స్వచ్ఛందంగా రతియం కార్డుల నుండి తొలగిస్తామని, పారదర్శకంగా నిర్వహించే ఈ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మేలుకలిగేలా సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, దీనికి అందరూ సహకరించాలని అన్నారు.ఇందుకుగాను రైతులు సన్నదాన్న్యాన్ని ఎక్కువగా పండించాలని ,సన్న ధాన్యం ఉత్పాదన తక్కువ , నీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాలుకు 2320 /- చెల్లిస్తూ.. 500/- రూపాయల బోనస్ సైతం ఇస్తున్నదని, మధ్యాహ్నం భోజన పథకం ,హాస్టల్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అన్నింటికి సన్న బియ్యం సరఫరా చేయడంతో పాటు, ఇకపై చౌక ధర దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున రైతులు సన్న ధాన్యం పండించాలని కోరారు.దర్తి ఆబా యోజన కింద గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, తిరుమలగిరి సాగర్లోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. నిరుద్యోగులైన ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ ,ఈబిసి, ఓబీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం కింద 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14 వరకు పొడగించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆదాయ,కుల ధ్రువపత్రాలకు దరఖాస్తులు వస్తే 48 గంటల్లో ఇవ్వాలని తహసిల్దారును ఆదేశించారు.స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం పథకం చారిత్రక కార్యక్రమాన్ని అన్నారు. 40 ఏళ్లుగా దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటిని ఎవరు తినటం లేదని ,అవన్నీ రీసైక్లింగ్ అవుతున్నాయని, అలాంటిది తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషమని అన్నారు. ధనవంతులతో పాటు, బీదవారు సైతం సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు.తమ ప్రభుత్వం రైతులు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని ,ఇందులో భాగంగానే ఉచిత బస్సు, 500/- రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, గృహ జ్యోతి, రైతులకు బోనస్, రైతు భరోసా వంటి పథకాలన్నింటిని అమలు చేయడం జరుగుతున్నదని, ఈ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం తాము నిరంతరం పనిచేస్తామని తెలిపారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తిరుమలగిరి సాగర్ స్పెషలాఫీసర్, ఏపీ డి శారద, మాజీ జెడ్పిటిసి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్ తదితరులు మాట్లాడారు.గృహనిర్మాణ శాఖ పి డి రాజ్ కుమార్,స్థానిక తహశీల్దార్ తదితరులు ఉన్నారు.అంతకుముందు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు తహసిల్దార్ కార్యాలయంలో తిరుమలగిరి సాగర్ మండలంలో చేపట్టిన భూమి రెగ్యులరైజేషన్ పైలట్ ప్రాజెక్ట్, ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు ,వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై సమీక్షించారు. పైలెట్ ప్రాజెక్టు కింద అర్హులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎం ఎల్ ఏ కోరారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్,శాసన సభ్యులు చౌకధర దుకాణాన్ని ప్రారంభించి సన్న బియ్యాన్ని పంపిణీచేశారు.