జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చారా.. ?
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు :
కేంద్రప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంతవరకు సహాయపడుతున్నాయో తెలియజేయాలన్నారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024-25లో జాతీయ ఆహార భద్రతా మిషన్(NFSM) పేరును జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ (NFSNM)గా మార్చారన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ (DA&FW) దేశంలో పప్పుధాన్యాలు, పోషకాహార ధాన్యాలు, వరిధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి NFSNMని అమలు చేస్తోందన్నారు. జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ కింద, పంటల ఉత్పత్తి, రక్షణ, సాంకేతికతలు, పంటల విధానం ఆధారిత ప్రదర్శనలు, కొత్తగా విడుదల చేసిన రకాలు, హైబ్రిడ్ల ధృవీకృత విత్తనాల ఉత్పత్తి & పంపిణీ, సమీకృత పోషకాలు మరియు తెగుళ్ల నిర్వహణ పద్ధతులు, పంటల సీజన్లో శిక్షణల ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంపొందించడం మొదలైన వాటిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రైతులకు ప్రోత్సాహకాలు అందించబడతాయని వివరించారు.
అలాగే ప్రధానమంత్రి-రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(PM-RKVY) కింద రాష్ట్రాల నిర్దిష్ట అవసరాలు, ప్రాధాన్యాల కోసం భారత ప్రభుత్వం సౌలభ్యాన్ని అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి మంజూరు కమిటీ(SLSC) ఆమోదంతో రాష్ట్రాలు PM-RKVY కింద తృణధాన్యాలు, మినుము(శ్రీ అన్న స్కీం) సాగును ప్రోత్సహించవచ్చని చెప్పారు.