కంపుకొడుతున్న గణేష్ నగర్..గండిమైసమ్మ కాలనీలు
- సంవత్సర కాలంగా రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీరు..
- డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక అవస్థలు పడుతున్న జనాలు..
- రోగాలతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు..
మేడ్చల్ జిల్లా: దుండిగల్ మున్సిపల్ పరిధి గండిమైసమ్మ, గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2,3 లో డ్రైనేజీ మురికి నీరు అంతా రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పారుతోంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
గత సంవత్సర కాలం నుండి ఈ మురుగు నీటితో అవస్థలు పడుతున్న ఏ ఒక్క అధికారి చర్యలు తీసుకులేదు. ఈ సమస్య సమస్యగానే ఉండిపోయింది. కానీ సమస్యను తీర్చే నాధుడే లేకుండా పోయాడు. ఇక్కడ జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు మీడియాకు చెప్పుకొచ్చారు. గండి మైసమ్మ గణేష్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే
ప్రధాన కారణం. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురికి నీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో చుట్టూ పక్కల నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికినీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, అసలే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
దీంతో పాటు రోడ్లపై రాకపోకలు సాగించలేక వాహనదారులు, పాదాచారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.