శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేస్తే ఆదాయం పెరుగుతుంది: బొజ్జల రిషితా రెడ్డి
శ్రీకాళహస్తి, జూన్ 12
వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జల రిషితా రెడ్డి, శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించిన విధంగా సాగు చేయడం ద్వారా రైతులు అనవసర ఖర్చులను తగ్గించుకొని మంచి దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి వారు నిర్వహించగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులు ఇందులో పాల్గొన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్త డా. సుమంతా కుందూ, వ్యవసాయాధికారి సూర్యప్రకాశ్ రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త రాము కుమార్ ముఖ్యంగా పాల్గొన్నారు.
రైతులకు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో విత్తనాల ఎంపిక, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, పచ్చిరొట్ట పంటలు, డ్రమ్ సీడర్ వాడకంతో వరి సాగు, వ్యవసాయ డ్రోన్లు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ యూరియాను రిషితా రెడ్డి స్వయంగా రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు, మొబైల్ యాప్ల ప్రాముఖ్యత, పశుపోషణ తదితర అంశాలపై సమాచారం అందించారు.