ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
మేడ్చల్ జిల్లా : ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన లభించింది. అధికారుల్లో చలనం కలిగించింది. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లి 14 వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ ల ముందు ఒక డంపింగ్ యార్డ్ ను తలపించే విధంగా చెత్త చెదారం, కుళ్లిన పదార్థాలను అక్కడ వేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ప్రజలు మీడియాతో వారి ఆవేదన చెప్పుకున్నారు. స్థానిక సమస్యపై ట్రూ పాయింట్ న్యూస్ లో కథనం ప్రచురితమైంది. కథనానికి దుండిగల్ మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ నిల్వ ఉన్న చెత్తను తీయించి వేశారు. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేశారు. స్థానిక ప్రజలు వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ కు మరియు సిబ్బందికి, ట్రూ పాయింట్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ ఎలాంటి చెత్త వేయకుండా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.