ఇక మాటలు లేవు.. మాట్లాడుకోడాలు లేవు..
- బిఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు
- పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు
- పార్టీని నడిపిస్తుందే నేను..
- గతంలో నా రాజీనామా వద్దని ఎందుకు అన్నారో చెప్పాలి..
- తండ్రి కేసీఆర్.. అన్న కేటీఆర్ పై పరోక్ష ఆరోపణలు
ఎమ్మెల్సీ కవిత తెగేసి చెప్పారు.. బిఆర్ఎస్ వ్యవహారాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ నాయకత్వం పైన తిరుగుబాటు బావుటా ఎగరవేసారు. ఇంటి ఆడపడుచులపై ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ తల్లిని మారిస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన పనులు సగం తానే చేస్తున్నానని ,తన పైన ఆరోపణలు వచ్చిన సమయంలోనే రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని వెల్లడించారు. బీజేపీతో విలీనం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తాను అడ్డుకున్నానని కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ తో తెగ తెంపులకు కవిత డిసైడ్ అయిపోయారు. ఇక తన దారి తనదేనని తేల్చి చెప్పారు. తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని చెప్పెకొచ్చారు. పార్టీ ఫోరంలో మాట్లాడాలని చెబుతున్నారని.. అసలు పార్టీకి ఫోరం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పార్టీని నడిపించే సత్తా లేని మీరు తనకు నీతులు చెబుతున్నారా అంటూ పరోక్షంగా కేటీఆర్ ను టార్గెట్ చేసారు. తాను 25 ఏళ్లుగా కేసీఆర్ కు లేఖలు రాస్తున్నానని... ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రతీ సారి కేసీఆర్ లేఖలు చూడగానే చించేస్తారని.. ఈ సారి బయటకు ఎలా ఇచ్చారని పరోక్షంగా కేసీఆర్ పైన అనుమానాలు వ్యక్తం చేసారు. కేటీఆర్ కు నోటీసులు ఇస్తే ట్విట్టర్ లో పోస్టులు పెడితే సరి పోతుందా అంటూ కవిత నిలదీశారు.
డబ్బులు ఇచ్చి తన పైన విమర్శలు చేయిస్తున్నారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ను బీజేపీ లో కలపాలని చూస్తున్నారని కవిత సంచలన అంశాలను బయట పెట్టారు. తాను జైల్లో ఉన్న టైం లోనే బీజేపీలో విలీనం పైన ప్రతిపాదన చేశారని.. తాను అడ్డుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ మునిగి పోయే నావ అని వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ లాగా తిక్కదాన్ని అని చెప్పిన కవిత.. తాను ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. పార్టీని బలోపేతం చేసే పద్దతి ఇదేనా అంటూ కవిత ప్రశ్నించారు. లేఖ ఎందుకు రాసావని ప్రశ్నిస్తున్నారని.. తాను వంద లేఖలు రాసానని చెప్పారు. తాను ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం లేఖ రాస్తే.. బయటకు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. లీకు వీరులను బయట పెట్టమంటే.. గ్రీకు వీరుల్లాగా తన పైన పడుతున్నారని మండిపడ్డారు. తాను కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేశానని కవిత గుర్తు చేసారు.
ఇక కవిత వ్యహారాలపై సీరియస్ గా ఉన్న బిఆర్ఎస్ అధిష్టానం ఆమెకు నోటీసులు సిద్ధం చేసింది. ఎన్ని అడ్డంకులు ఎదురైన రాష్ట్రం కోసం పోరాటం చేయడం ఆగేది లేదని కవిత తెగేసి చెప్పడంతో బిఆర్ఎస్ ఆలోచనలో పడింది.