ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసు సిబ్బంది కృషి చేయాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అన్నారు. డిజిపి కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రజలకు శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్లకు వస్తారని వాటినీ పరిష్కరించినప్పుడే రాణించగలుగుతారని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసు వ్యవస్థ పై నమ్మకం పెరుగుతుందని, దేశంలోనే ప్రధమ స్థానాన్ని పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని అదే స్థాయిని నిలుపుకునేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఆకాంక్షించారు. పోలీసు లపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని వాటిని పరిష్కరించి వారి ప్రశంసలు పొందాలని సూచించారు. డయల్ 100 కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సదా అవకాశము పోలీస్ శాఖకు దక్కిందని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు వారు ఎవరికి ఫిర్యాదు చేయరని అభిప్రాయపడ్డారు. నేరస్తులకు శిక్షలు పడేవిధంగా దర్యాప్తు చేసి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థ 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందని, ప్రజల ఆశించిన స్థాయిలో కృషి చేసినట్లయితే మంచి పేరు వస్తుందని అన్నారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం. భగవత్ నకిలీ విత్తనాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నకిలీ విత్తనాలను తయారు చేసే నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఐ జి రమణకుమార్, డి.ఎస్.పి సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.