పహల్గామ్ ఉగ్రదాడిపై సూరారం డాక్యుమెంట్ రైటర్ల నిరసన..!
పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. మేడ్చల్ జిల్లా సూరారం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలిపారు. ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దారుణ సంఘటనపై డాక్యుమెంట్ రైటర్లు నల్ల బ్యాడ్జులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం ప్రతినిధి రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. "దేశ భద్రతను ఛిన్నాభిన్నం చేయాలని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరులైన 26 మంది కుటుంబాల పట్ల మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి," అని చెప్పారు. దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు పోనివ్వకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ భావాలను వ్యక్తపరిచారు. ఇలాంటి సంఘటనలపై సమాజం మేల్కొని సంఘీభావంతో స్పందించడం అవసరమని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చెప్పారు.