తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కూతురు..
ఛత్తీస్ ఘఢ్ TPN: నిత్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్నాడని, కన్నతండ్రిని ఓ మైనర్ కుమార్తె కడతేర్చింది. అతన్ని అమానుషంగా గొడ్డలితో నరికి చంపింది. తర్వాత తండ్రిని ఎవరో హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. అయితే కూతురే తండ్రిని చంపినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ లోని జష్ పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బాగ్ బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో నివసించే 50 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. గొడ్డలితో నరికి చంపిన అతడి మృతదేహం మంచంపై పడి ఉన్నట్లు ఏప్రిల్ 22న ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. తన తండ్రిని ఎవరో హత్య చేసినట్లు 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు చెప్పింది.
కాగా, ఏప్రిల్ 21న రాత్రివేళ తల్లి ఇంట్లో లేకపోవడంతో కూతురు ఒక్కతే ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. తాగి వచ్చిన తండ్రి ఆమెతో గొడవపడటంతో గొడ్డలితో నరికి చంపిందని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు నిత్యం తాగి వచ్చి తల్లిని, తనను కొట్టడం, ఇంట్లో గొడవపడటం సహించలేక గొడ్డలితో నరికి తండ్రిని చంపినట్లు కూతురు ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో మైనర్ బాలికను జువైనల్ హోమ్కు తరలించినట్లు చెప్పారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.