పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఊరట
కరీంనగర్ జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. కేసులో ఆయనను ఆరెస్ట్ చేయొద్దంటూ సోమవారం (ఏప్రిల్ 28) వరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని, కానీ కౌశిక్ రెడ్డి పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా హైకోర్టు స్పష్టం చేసింది. క్వారీ యజమాని మనోజ్ను రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించారన్న ఆరోపణలపై మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు వెనుక రాజకీయ కక్షలున్నాయని, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో దీనిని కలగజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కౌశిక్ న్యాయవాది వాదన. కమలాపూర్ మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్, 2023 అక్టోబర్ 25న కౌశిక్ రెడ్డికి రూ. 25 లక్షలు చెల్లించాడని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) తెలిపారు. ఆ సమయంలో బెదిరింపుల వల్లనే ఆ మొత్తం చెల్లించారనీ, ప్రస్తుతం మరో రూ. 50 లక్షలు డిమాండ్ చేయడంతో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
అయితే 2023లో జరిగిన చెల్లింపుపై అప్పట్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని హైకోర్టు పీపీని ప్రశ్నించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.