ఢిల్లీ చేరుకున్న జేడీ వాన్స్.. వైరల్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం ఈరోజు ఉదయం పాలం ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. అమెరికా రెండవ మహిళా హోదాలో ఉషా వాన్స్ ఫస్ట్ టైమ్ స్వదేశానికి వచ్చారు. ఉషా వాన్స్ తెలుగమ్మాయి. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు. ఉషా చిలుకూరి తన ముగ్గురు పిల్లలతో భారత్ కు వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత పెరిగింది.
ఇక మోదీతో భేటీలో భాగంగా ఈ సందర్భంగా సుంకాలపై ఇరువురు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా జేడీ వాన్స్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. జేడీ వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు భారత్కు వస్తున్నారు. ఇక మంగళవారం రాజస్థాన్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కాగా వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.