తీవ్ర విషాదం.. 148 మంది మృతి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ తీవ్ర విషాదంలో నదిలో పడవ బోల్తా పడి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో నదిలో పడవ బోల్తా పడినప్పుడు మహిళలు, పిల్లలు సహా 500 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు స్థానిక అధికారులకు మీడియా నివేదికలు తెలిపాయి. మటాంకుము అనే ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరుతుండగా, హెచ్బి కొంగోలో అనే పడవలో ఎంబండకా పట్టణానికి సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు అప్రమత్తం అయ్యేలోపు దారుణం చోటు చేసుకుంది.
కాగా ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన దాదాపు 100 మందిని స్థానిక టౌన్ హాల్లోని టెంపరరీ ఆశ్రయానికి తరలించినట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులలో చేర్చారు. కాంగోలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాంగోలోని గ్రామాల మధ్య రవాణాకు పాత చెక్క పడవలు ఉపయోగిస్తుంటారు. దీంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2023లో, కాంగోలో ప్రయాణిస్తున్న పడవ ఈక్వేటర్లో మునిగిపోవడంతో కనీసం 47 మంది మరణించారు. కాగా ఈ ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది.