హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే గురువారం రాత్రి అర్ధాంతరంగా నోటీసులు పెట్టి మూసివేయడంతో జిందాల్ పరిశ్రమలో పనిచేస్తున్న 400 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో శుక్రవారం నాడు జిందాల్ పరిశ్రమ దగ్గర కార్మిక సంఘాల నాయకులతో కలసి నిరసన తెలిపారు. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా అర్ధాంతరంగా పరిశ్రమ మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటన్నది తెలపాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అయితే కంపెనీ యాజమాన్యం మాత్రం తమకు ముడి సరుకు కొరతతోపాటు విద్యుత్ చార్జీల మోత కారణంగా పరిశ్రమ నడపలేని పరిస్థితి ఏర్పడిందని.. దీంతో తాము తప్పని పరిస్థితులలో లేఆఫ్ ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇస్తూ నోటీసులో తెలిపారు. అయితే ఇదే తరహాలో గతేడాది పరిశ్రమను ఐదు నెలల పాటు మూసివేస్తే.. నాడు కార్మికులు తమ పోరాటంతో గత సెప్టెంబరు నుంచి పరిశ్రమని నడిపించారు. అయితే మళ్లీ అదే కారణాలతో పరిశ్రమను మూసివేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జిందాల్ పరిశ్రమ మూతపడటంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయని.. అధికారులు, పాలకులు జిందాల్ పరిశ్రమ నడిపించేలా చర్యలు తీసుకోకుంటే తామంతా రోడ్డున పడటం ఖాయమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.