న్యాయవ్యవస్థపై వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
భారత న్యాయవ్యవస్థ పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఈ టాపిక్ పై స్పందించారు. న్యాయవ్యవస్థను ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడారు. కోర్టులు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి మనకు ఉండదని అన్నారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142, న్యాయవ్యవస్థకు 24 గంటలు అందుబాటులో ఉన్న ప్రజాస్వామ్య శక్తులపై అణ్వాయుధ క్షిపణిగా మారింది అని కూడా ఆయన అన్నారు.
తాజాగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్లో పెట్టడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్తో కూడిన బెంచ్ ఈమేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 201 ప్రకారం, ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినట్టయితే.. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి. కానీ రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలన్నది రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంతమాత్రాన రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారం ఉందని అనుకోరాదంటూ తీర్పు చెప్పింది.