మేజర్ సందీప్ తన కర్తవ్యం నిర్వర్తించాడు
ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడులు ఏ భారతీయుడు మర్చిపోలేరు. ఈ దుర్ఘటనలో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు తాజ్ హోటల్ తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవుర్ హుస్సేన్ రాణా ముఖ్య పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, కాసేపట్లో అతడ్ని అమెరికా నుంచి భారత్కు తీసుకు రానున్నారు. కాగా, ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.
అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక, నా కొడుకు సందీప్ 26/11 బాధితుడు కాదు, అది అతడి కర్తవ్యం అన్నారు. తహావుర్ రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణం, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలి, న్యాయం కోసం ఎదురు చూస్తున్నానని, బాధితులందరికీ ఇది ఒక ఆశా కిరణం అని పేర్కొన్నారు. కాగా భారత్ కు ముంబై ఉగ్రవాదుల నిందితుడు తహావూర్ రాణాను అప్పగించారు.