పిఠాపురంలోనే ఎందుకిలా..?
- టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు
- పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం
- కంచుకోటగా మార్చుకోవాలని జనసేన
- కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ
- అవిర్భావ సభలో వర్మపై నోరుజారిన నాగబాబు
- నాగబాబు కామెంట్స్తో వర్మ అనుచరుల రచ్చ
- వర్మకు ఛాన్స్ ఇస్తున్న జనసేన అంతర్గత కలహాలు
టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఏం అనుకుంటున్నారో చెప్పరు.. ఏం చేయబోతున్నారో చెప్పరు. ప్రతిదీ రహస్యంగా ఉంటుంది. కానీ.. ఆయన కామెంట్స్ మాత్రం ఏదో జరగబోతోందనే హింట్ ఇస్తూ ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సరిగ్గా అదే జరుగుతోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే.. రెండు పార్టీలు నియోజకవర్గంపై పట్టు సాధించడం కోసం సిగపట్లు పడుతున్నాయి. ఓవైపు జనసేన పార్టీగా పట్టు సాధించడానికి పోరాడుతోంది. మరోవైపు వర్మ వ్యక్తిగతంగా నియోజకవర్గంపై తన పట్టును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు మొదటి నుంచి కూడా పిఠాపురంలో వర్మ రాజకీయం గుంభనంగా చేస్తూ వస్తున్నారు.
వర్మ ఇక్కడ ఒకే ఒక్కసారి గెలిచారు. అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా. మొదట ఆయన 2009లో టీడీపీ తరపున పోటీ చేసి.. అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థి వంగా గీత చేతిలో ఓడిపోయారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం వారిద్ధరి స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నా.. వర్మ మాత్రం ఓడిపోయారు. 2014లో టీడీసీ ఆయనకే టికెట్ నిరాకరించింది. టీడీపీ నుంచి పోతుల విశ్వం టికెట్ పొందారు. అటు వైసీపీ నుంచి పెండెం దొరబాబు బరిలో నిలిచారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కొత్తగా ప్రారంభించిన జనసేన పార్టీ తరపున టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు తన బహిరంగ మద్దతును ప్రకటించారు. పిఠాపురంలో కాపు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో కాపు ఓటర్లదే కీలకపాత్ర. ఐతే.. విశ్వంపై అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో లోకల్ కాపులంతా వర్మకే చేద్దామని పవన్ దగ్గర ప్రతిపాదించగా.. అందుకు పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారు. దీంతో ఆ ఎన్నికల్లో కాపు ఓటర్లంతా కూడా వర్మకు మద్దతు ఇవ్వడంతో ఆయన స్వత్రంత్ర అభ్యర్థిగా గెలిచారు. తరువాత 2019 లో ఆయన మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
ఇకపోతే.. గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్.. పిఠాపురం ఇన్చార్జ్గా ఉదయ్ను నియమించినప్పుడు.. వర్మ ఆయనను అనేక విధాలుగా తప్పించడానికి ప్రయత్నించారు. ఉదయ్ అభ్యర్థి అయితే.. తాను కచ్చితంగా పోటీ చేస్తానని.. పవన్ అభ్యర్థి అయితే, తాను పోటీ చేయకుండా ఉంటానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. కానీ.. పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించినప్పుడు.. వర్మ తన అనుచరులతో నానా రచ్చ చేయించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వర్మకు ఫోన్ చేసి, భవిష్యత్లో మంచి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారట. ఐతే.. ఈ మధ్య వరుసగా వర్మ అవకాశాలు జారిపోతుంటే.. ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుకుంటోందట. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దెబ్బతీసి, తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడం ప్రారంభించారట. తర త్యాగం వల్లే పవన్ గెలిచారని.. అదే తాను పోటీ చేస్తే ఓడిపోయేవారని ప్రచారం మొదలెట్టారు. ఇది క్రింది లెవెల్ లో వర్మ చేశారు. కాని ఆ సెగ జనసేన నేతలకు గట్టిగా తగిలింది. ఇది జనసేన పార్టీ శ్రేణుల్ని ఆగ్రహానికి గురిచేసింది. ఆ ఎపెక్ట్ పడ్డ నాగబాబు కర్మకామెంట్స్తో బరస్ట్ అయిపోయారు. అదే ఛాన్సుగా తీసుకుని ఇక వర్మ తన ప్లాన్ మొదలెట్టారని అంటున్నారు. వర్మ నిరంతరం నియోజకవర్గంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారట. ఐతే.. వర్మ అనుచరులు అల్లర్లు సృష్టిస్తున్నా.. నాగబాబు మాత్రం గతంలో తాను చేసిన డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి తన పర్యటనలో ప్రశాంతంగానే ఉంటున్నారు. ఎక్కడా కూడా మరోసారి నోరు జారకుండా.. మాట తూలకుండా.. ఆచితూచి మాట్లాడుతున్నారు.
మరోవైపు జనసేనలో అంతర్గత సమస్యలు కూడా వర్మకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికుల అభిప్రాయం ప్రకారం, నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి అంత సీన్ లేదట. అంతేకాకుండా.. ఆయన ఇన్చార్జ్ హరి ప్రసాద్ కూడా సరైన గైడెన్స్ ఇచ్చే పరిస్ధితి లేదని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీంతో.. ముందునుంచి జనసేనకు అండగా ఉన్న మద్దతుదారులు మరియు కొత్తవారి మధ్య అంతరం ఏర్పడుతోంది. అటు వర్మ కూడా ఆ గ్రూపులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పిఠాపురంలో రాజకీయం యమ రంజుగా నడుస్తోంది. అటు పవన్ ఎన్నిసార్లు రివ్యూ చేసి.. ఎన్ని పనులు చేస్తున్నా.. పిఠాపురంలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం మాత్రం డిస్ట్రబ్ చేస్తోంది. ఏదేమైనా.. జనసేనాని ఓసారి పిఠాపురంపై దృష్టిసారించి.. అంతర్గత కలహాలకు ఫుల్స్టాప్ పెట్టకపోతే మాత్రం పరిస్థితి చేజారిపోయేలానే కనిపిస్తోంది. మరి పిఠాపురంలో పరిస్థితులు ఎప్పుడు శాంతిస్తాయో చూడాలి.