చెప్పులు దాస్తే రూ. 5 వేలు.. పెళ్లికొడుకుపై దాడి
పెళ్లి తంతులో ఏ సంప్రదాయంలో అయినా ఎన్నో రకాల సంప్రదాయాలు ఉంటాయి. అలా పెళ్లికొడుకు చెప్పులు దాచిపెట్టి.. పెళ్లి కూతురి తరపున బంధువులు ఆట పట్టించి డబ్బులు వసూళ్లు చేస్తుంటారు. ఈ ఆట పెళ్లిలో ఎంతో సరదాగా ఆడుతూ.. పెళ్లికొడుకును ఆటపట్టిస్తూ ఉంటారు. కానీ తాజాగా జరిగిన ఓ వివాహంలోని ఈ సంప్రదాయం ఆ పెళ్లికొడుక్కి జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవంగా మారింది. అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో వివాహ తంతు జరుగుతుంది. ఈ క్రమంలో పెళ్లికొడుకు చెప్పులు దాచి పెట్టినందుకు పెళ్లికూతురు బంధువులకు రూ.50 వేలకు బదులు 5 వేల రూపాయలు ఇచ్చారని.. వరుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో వరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఉత్తరాఖండ్ కు చెందిన వరుడు ముహమ్మద్ షబీర్ కు, ఉత్తరప్రదేశ్ లోని ఓ యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. వారి ఆచారాల ప్రకారం చెప్పులు దాచడం అనే కార్యక్రమంలో భాగంగా వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులు దాచిపెట్టారు. వాటిని ఇవ్వాలంటే 50 వేల రూపాలయలు ఇవ్వాలని కోరారు. అయితే పెళ్లికొడుకు మాత్రం 5 వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన వధువు బంధువులు పెళ్లి కొడుకుని ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. దీంతో పెళ్ళి కొడుకు బంధువులు పెళ్లికి పెట్టిన బంగారం గురించి ప్రశ్నించారు. మాటా మాటా పెరిగి ఇద్దరి కుటుంబాల మధ్య గొడవ పెరిగింది. ఈ క్రమంలో వరుడిని గదిలో బంధించి కొట్టారు. ఈ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి.. కౌన్సిలింగ్ ఇచ్చారు.