ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత..
- తెల్లవారుజామున కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఎదిగాడు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు..
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(63) ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. గచ్చిబౌలి AIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5:45 కు హార్ట్ స్ట్రోక్ రావడంతో మృతి చెందినట్లు అధికారికంగా వైద్యులు తెలిపారు. దీనితో బిఆర్ఎస్ పార్టీ, ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. 1963 జూన్ 2వ తేదీన కృష్ణమూర్తి, మహనందకుమారి దంపతులకు హైదర్ గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు. జీవిత భాగస్వామి పేరు సునీత.. సంతానం.. మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు).
మాగంటి రాజకీయ అర్రంగేట్రం..
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాడు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా పని చేశాడు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు. 2024 లో కూడా ఎన్నికల్లో మరోసారి గెలిచి తన సత్తా చాటుకున్నాడు. 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. వరుసగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపొంది తన బలం, బలగం నిరూపించుకున్నాడు. పార్టీలో, నియోజకవర్గంలో ఆయానకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమించాడు. అందుకే వరుసగా మాగంటికె జనం జై కొట్టారు.
నిర్మాతగా...
1995లో పాతబస్తీ, 2000లో రవన్న, 2004లో భద్రాద్రి రాముడు, 2009లో నా స్టయిలే వేరు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.