నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని చంపారు. మావోయిస్టు లేఖ..
నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని, మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యామని తెలిపింది. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. 6నెలలుగా మాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని, కేశవరావు టీమ్లో ఉన్న ఆరుగురు ఇటీవల లొంగిపోయి వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారాడని రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి
20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టి
10 గంటల్లో ఐదు ఎన్కౌంటర్లు చేశారన్నారు. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భంధించిన కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని లేఖలో వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారని, మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదని, మమ్మల్ని వదిలి సురక్షిత ప్రాంతానికి కేశవరావును తరలించేందుకు ప్రయత్నించాం కానీ మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదన్నారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని మాతోటే ఉన్నారని చెప్పారు. పాక్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదని ఆరోపించారు.