నాలుగేళ్లుగా నరకం.. పట్టించుకోకపోతే ప్రాణాలకు ప్రమాదం..
మేడ్చల్ జిల్లా సమస్యలతో సతమతం అవుతోంది. అధికారుల నిర్లక్ష్యం జనాలకు శాపంగా మారింది. నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న పట్టించుకునే నాధుడు లేక ప్రజల అవస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి సుభాష్ నగర్ డివిజన్ సూరారం రామ్ లీలా మైదాన్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర డ్రైనేజ్ పొంగి పొర్లుతోంది. ఇది ఒకటి, రెండు రోజుల నుండి వస్తున్న డ్రైనేజీ కాదు, గత నాలుగు ఏళ్ల నుండి డ్రైనేజీ ప్రవహిస్తూనే ఉంది. ఈ డ్రైనేజీ వాటర్ మీద నుండి రోజుకు అనేక మంది పాదచారులు మరియు వాహనదారులు ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. డ్రైనేజీ పొంగుతున్న పరిసరాలలో తినుబండారాలను వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. వివిధ ఇళ్లల్లో నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ వల్ల వెజిటేబుల్ మార్కెట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై గతంలో స్కూల్ విద్యార్థులు మరియు వెజిటేబుల్ మార్కెట్ వారు, పాదచారులు అందరు కలిసి ఇక్కడ ధర్నా నిర్వహించారు. అయినా ఏ ఒక్క జిహెచ్ఎంసి అధికారులు స్పందించలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఒక్కరోజు పరిష్కారం మాకు వద్దు, శాశ్వతంగా పరిష్కారం ముద్దు అంటున్నారు. సంవత్సరాల తరబడి ఒక డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అటు జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు ఇంత నిర్లక్ష్యంగా వ్యవరించడానికి కారణమేమిటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది లేకపోవడమే ప్రధాన సమస్య అని ప్రజలు చెప్పుకొస్తున్నారు.