హైదరాబాద్ శివార్లలో భారీగా ఆస్తులు కూడబెట్టిన బ్యూరోక్రాట్స్
- ఔటర్ చుట్టూ కోట్ల రూపాయల విలువ చేసే భూములు
- దక్షిణాది రాష్ట్రాల అధికారుల కన్నా.. ఉత్తరాది రాష్ట్రాల అధికారులకే ఎక్కువ
- సీనియర్స్ తో పోటీపడుతున్న కొత్త అధికారులు
- వెంచర్స్ బిల్డర్స్, కాంట్రాక్టర్స్ తో మంతనాలు
- డిఓపిటికి తప్పుడు నివేదికల సమర్పణ
- ఐఏఎస్, ఐపీఎస్లపై నిఘా.. సీన్లోకి కేంద్ర ఇంటెలిజెన్స్
- లెక్కతేల్చి నివేదిక అందించిన ఇంటెలిజెన్స్ అధికారులు
- చర్యలకు రంగం సిద్ధం చేసిన కేంద్రం
- ఆ విఐపిల మీద ఇంటెలిజెన్స్ నిఘా
- ఆ బ్యూరోక్రాట్స్ కి బోలెడు ఆస్తులు
తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్లపై కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వారితో పాటు బంధువుల పేర్ల మీద కూడబెట్టిన ఆస్తుల చిట్టాను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా వారు భారీ మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక వనరులు ఎక్కడ నుంచి వచ్చాయనే కోణంలో ఫీల్డ్ లెవల్లో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. కొంత మంది బ్యూరోక్రాట్స్ హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు, ఫామ్హౌజ్లు కొనుగోలు చేశారని, కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది..
గత ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల వద్ద పెద్ద ఎత్తున అక్రమ అస్తులు ఉన్నట్లు కొందరు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఆ జాబితాలో విపక్షాలకు చెందిన కొందరు సీనియర్ నేతలు సైతం ఉన్నట్లు తెలిసింది. తమ ఫిర్యాదుతో పాటు ఆధారాలను సైతం పంపిడంతో ప్రధానంగా ఔటర్ చుట్టూరా ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్లకు ఆస్తులు ఉన్నట్లు వీడియో, ఇమేజ్ డాక్యుమెంట్స్ను జత చేసినట్టు తెలిసింది. దీంతో ఎక్కడెక్కడ ఏ ఆఫీసర్కు ఎన్ని ఆస్తులు ఉన్నాయి..? ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం వాటి విలువ ఎంత..? వారి పేరుతోనే ఉన్నాయా..? లేక బంధువుల పేర్ల మీద ఉన్నాయా..? అనే కోణంలోనూ క్షేత్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ తో వివరాలు సేకరించినట్లు తెలిసింది. అలాగే చాలా మంది ఐఏఎస్లకు గ్రేటర్ చుట్టూరా వ్యాపారాలు చేస్తున్న బడా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో బినామీల పేరుతో వాటాలు ఉన్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో పని చేస్తోన్న మెజార్టీ ఐఏఎస్లకు ఖరీదైన విల్లాలు, ప్లాట్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు నివేదిక అందజేశాయి.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న చాలా విలువైన భూములు బ్యూరోక్రాట్స్కు చెందినవే అనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. అందులో మెజార్టీ వాటా నార్త్ ఇండియన్కు చెందిన ఆఫీసర్లవే అనే ప్రచారం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సదరు ఆఫీసర్లు పలు కీలక శాఖల్లో పని చేశారు. ఆ టైంలోనే పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్కారు వద్ద రాయితీలు పొందిన రియల్టర్లు, బిల్డర్ల సహకారంతోనే అంతటి విలువైన ఆస్తులను వారు దక్కించుకున్నట్లు అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో ఓపెన్గా టాక్ నడుస్తోంది.క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలోనే ఆల్ ఇండియా సర్వీసులోని ప్రతి అధికారీ తమ స్థిర ఆస్తుల వివరాలను హోంశాఖ పరిధిలోని డీఓపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కు సమర్పించాలి. భూములు, ఇండ్లు, ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేస్తే వాటి వివరాలను పేర్కొనాలి. తమ పేరు మీద కొనుగోలు చేసినా, ఫ్యామిలీ మెంబర్ల పేరు మీద కొనుగోలు చేసినా తప్పకుండా కేంద్రానికి తెలియజేయాలి. కానీ రాష్ట్రంలోని చాలా మంది ఐఏఎస్లు తాము కొనుగోలు చేసిన అన్ని స్థిర ఆస్తుల వివరాలను డీవోపీటీకి చెప్పకుండా, ఒకటి అర చెప్పి చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో పనిచేస్తోన్న కొందరు ఐఏఎస్లు 20 ఏళ్ల కిందట తమ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలనే కేంద్రానికి పంపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆఫీసర్లు తమ పేరు మీద, ఫ్యామిలీ మెంబర్ల పేరు మీద ఎలాంటి స్థిర ఆస్తులను కొనుగోలు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. తమకు సన్నిహిత బంధువులు, స్నేహితుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ఇదిలావుంటే ఒకప్పుడు కొత్తగా సర్వీసులోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్లు అక్రమాలకు దూరంగా ఉంటారనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. ట్రైనింగ్ పూర్తయి, ప్రొబేషనరీ టైమ్ నుంచే ఆస్తులు సంపాదించాలనే లక్ష్యంగా యంగ్ బ్యూరోక్రాట్స్ ఉన్నట్టు చర్చ సమాచారం. అందుకు కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ఇన్సిడెంట్ను ఉదాహరణగా పేర్కొంటున్నారు. ప్రొబేషనరీ టైమ్లో ఉండగానే ఓ లేడీ ఐపీఎస్ గ్రేటర్ పరిధిలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వివాదంలో ఇరుక్కున్నారు. గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని డీవోపీటీకి ఫిర్యాదు చేయగా సదరు ఆధికారిణి ప్రొబేషనరీ టైమ్ను పొడిగించారు. అలాగే కొందరు యంగ్ ఐఏఎస్లు సైతం తాము పనిచేస్తోన్న జిల్లా పరిధిలో కొత్తగా వెంచర్లపై ఫోకస్ పెట్టి వాటాలు అడుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
30 ఏళ్ల సీనియార్టీ ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బంధువులకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గర 150 ఎకరాల విలువైన భూమి ఉంది. పక్కనే ఉన్న సర్కారు భూమిని కూడా కొంత కబ్జా చేసి ఈ మధ్య అక్కడ వెంచర్ డెవలప్మెంట్ పనులు ప్రారంభించారు. ఈ బిజినెస్లో ఓ బీఆర్ఎస్ ఎంపీ వాటా కూడా ఉన్నట్లు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్కు పదుల ఎకరాల్లో భూములు ఉన్నట్లు టాక్..
నార్త్ ఇండియాకు చెందిన మరో సీనియర్ ఐఏఎస్కు ఔటర్ చుట్టూ వందల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్, ఖరీదైన విల్లాలు ఉన్నట్లు, మరో సీనియర్ ఐఏఎస్ తన కొత్త భార్య పేరు మీద పెద్ద ఎత్తున విల్లాలు కొనుగోలు చేసినట్లు విమర్శలొస్తున్నాయి. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కన్ఫర్డ్ ఐఏఎస్కు అతనికే గుర్తులేనన్ని ఖరీదైన ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు ప్రచారం. కొందరు ఐపీఎస్లు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టకుండా 5 శాతం వడ్డీ రూపేణా రూ.10 కోట్లు వడ్డీ వ్యాపారులకు ఇచ్చి బిజినెస్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై ఇంటెలిజెన్స్ తో నిఘాపెట్టిన కేంద్రం వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు వినికిడి.