వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
శేఖర్, తిరుపతి TPN : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయాలు సామాన్య భక్తులను విస్మయానికి గురి చేస్తున్నాయి. గత నెల రోజులుగా ఎండ తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతోంది. అయితే శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేస్తున్న భక్తులు మొదటి గేటు ద్వారా ప్రవేశించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయం వెనుక వైపు ఉన్న నాలుగో గేటు ద్వారా వెలుపలకు వస్తుంటారు. దీంతో సామాన్య భక్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలోనే మొదటి గేటు నుంచి నాలుగో గేటు వరకు కాలినడకన వస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై సంఘటనలపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన ఆలయాధికారులు తూతూ మంత్రంగా భక్తులు నడిచే మార్గంలో పట్టాలను ఏర్పాటు చేసి.. తమ పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. అయితే భక్తుల కోసం ఏర్పాటు చేసిన పట్టాలపై మధ్యాహ్న సమయంలో నీరు పట్టకపోవడంతో అవి ఎండకు వేడవ్వడంతో.. భక్తులు ఆ పట్టాలపై నడుస్తుంటే కాళ్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. అయితే ఆలయ అధికారులు వీఐపీలు బస చేసే శ్రీ జ్ఞానప్రసూనాంభికా సదన్ దగ్గర నుంచి స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసే వీఐపీలకు మాత్రం.. పట్టాలతోపాటు నీడ కోసం కొబ్బారాకులతో పందిరి వేసి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు. సామాన్య భక్తులపై మాత్రం చిన్నచూపు ప్రదర్శించి అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సామాన్య భక్తులకు ఒకలా, వీఐపీలకు ఒకలా ఏర్పాట్లు చేయడంపై.. భక్తులంటే ఆలయాధికారులకు చిన్నచూపులాగా ఉందని చర్చ జరుగుతోంది. దీనిపై ఆలయ ఈవో స్పందించి సామాన్య భక్తులకు కూడా ఎండ తగలకుండా ఉండేలా తగు ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.