వారిపై సైబర్ నేరగాళ్ల పన్నాగం.. కేంద్రం అలర్ట్
ఆధ్యాత్మిక పర్యటకంపై సైబర్ నేరగాళ్లు ఫోకస్ చేశారు. పర్యటనకు వెళ్లేవారే లక్ష్యంగా ఆన్లైన్ స్కామర్స్ ఉచ్చులు బిగిస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లు, ఫేస్బుక్ పోస్టులు, గూగుల్ వంటి సెర్చింజన్లలో నకిలీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లతో బోల్తా కొట్టిస్తున్నారు. ఈ విషయాలు కేంద్రం దృష్టికి రావడంతో అలర్ట్ అయ్యింది. ఛార్ దామ్ యాత్రికులు, ఇతర పర్యటకులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పౌరులను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పర్యటకానికి సంబంధించి సేవలందిస్తామన్న పేరుతో నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేయడం, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, వాట్సప్ అకౌంట్ల నుంచి మెసేజ్ లు పంపుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది.
ముఖ్యంగా కేదార్నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్లు, ఛార్దామ్ యాత్రికులకు గెస్ట్ హౌస్ లు, హోటల్ బుకింగ్స్, ఆన్లైన్ క్యాబ్, ట్యాక్సీ బుకింగ్, హాలిడే ప్యాకేజీల పేరిట ఈ మోసాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ విభాగం పేర్కొంది. ఈ మోసపూరిత వెబ్సైట్లను నమ్మి చెల్లింపులు చేసినవారికి సేవలకు సంబంధించిన సందేశాలు రాకపోగా.. వారిచ్చిన కాంటాక్ట్ నంబర్లను సంప్రదించినప్పుడు స్పందన ఉండడం లేదన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం సూచించింది. ఇలాంటి ఘటనలు ఏవైనా పౌరుల దృష్టికి వస్తే cybercrime.gov.in పోర్టల్లో లేదా 1930కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించింది.