ఆ దేశంలో ఫస్ట్ ఏటీఎం.. స్పెషాలిటీ ఏంటంటే..
మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధాని హాజరయ్యారు. అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎం మరి. అదే తువాలు దేశం. ఇది ఆస్ట్రేలియా, హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడింది. దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయి అన్నారు. ఇది దేశానికి గొప్ప విజయమని.. మార్పుకు అవసరమైన కీలక స్విచ్ అని ఈ సందర్భంగా తెలిపారు. పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ దీని తయారీకి నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకు సాయం చేసింది. ఇటీవల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో తువాలు రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా డిజిటల్ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది.