సూడాన్లో 300 మంది పౌరులు మృతి
సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీకి మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఈ రెండు దళాలకు మధ్య విభేదాలతో మరోసారి ఈ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. గత రెండేళ్లుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఘటనలో కూడా దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు శిబిరాలపై శుక్ర, శనివారాల్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 300 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ అధికారికంగా తెలిపింది.
మృతుల్లో 20 మంది పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు నివేదికలు జారీ చేసింది. కాగా, ప్రపంచంలోని అతి పేద దేశాల్లో సూడాన్ ఒకటి. 2023 ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యింది. కాగా నేటికి ఈ ప్రాంతంలో రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 30 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.