ఏంటి రాజగోపాల్ రెడ్డి క్వాలిఫికేషన్..?

మా ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఒకే జిల్లాలో ఎక్కువమందికి మంత్రి పదవులిస్తే ఏంటంట? ఈ ప్రశ్నలన్నీ వేసింది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకవైపు రేవంత్ రెడ్డి హై కమాండ్ కు ఆన్సర్ ఇవ్వలేక, మంత్రి వర్గ విస్తరణపై చేతులెత్తేసి.. భారం వారి మీదే పెట్టి వదిలేశారు. అయినా సరే తనకు మాత్రం మంత్రి పదవి కావాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఎందుకంటే భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారంట.
మరోవైపు రెడ్లకు మంత్రి పదవులు ఎక్కువ వద్దని, సామాజిక సమీకరణాలు చూసుకోవాలని హైకమాండ్ చెబుతోంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే పదవులు ఎక్కువయ్యాయని మిగతా జిల్లాల నేతలు గోల పెడుతున్నారు. రేవంత్ రెడ్డి తనదైన రాజకీయంతో ఉత్తమ కుమార్ రెడ్డికి చెక్ పెట్టడం కోసం.. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఫ్రెండ్ షిప్ స్ట్రాంగ్ చేసుకున్నారు. అప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ పై ఎవరు విమర్శలు చేసినా కౌంటర్ ఇచ్చేస్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి వివాదాస్పదమే. సొంత రాజకీయం తప్పితే.. పార్టీ రాజకీయం తక్కువ. ఉన్నంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెటర్. రాజగోపాల్ రెడ్డి అయితే ప్యూర్ మనీ పాలిటిక్స్ అని విమర్శలు వస్తుంటాయి. డబ్బుంటే చాలు ఏ పనైనా అయిపోతుందనేది ఆయన కాన్సెప్ట్ అంటారు. ఒక దశలో సోదరుడిని కూడా లెక్కలోకి తీసుకోకుండా సొంతంగా ఎదగాలని ప్రయత్నించారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాక ముందు పీసీసీ అధ్యక్ష పదవి తనదేనని ప్రచారం చేసుకున్నారు. అందుకు హై కమాండ్ దగ్గర ఏర్పాట్లు కూడా చేసుకున్నారని చెప్పుకున్నారు. కాని రేవంత్ రావటంతో కథ అడ్డం తిరిగింది. ఆ కోపంతోనే రేవంత్ రెడ్డికి దూరంగా ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ తో టచ్ లో ఉంటూనే ..తర్వాత బిజెపిలోకి వెళ్లి మునుగోడులో పోటీ చేశారు. అప్పుడు వెంకటరెడ్డి కూడా డ్రామా వేశారనే చెప్పాలి. ఆ టైమ్ లో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బిజెపిలోకి వెళ్లారని ఇదే రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కాని రాజకీయం విచిత్రమైనది. తర్వాత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి .. ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు.
ఇన్ని చేసినా తనకు మాత్రం మంత్రి పదవి కావాల్సిందేననేది ఆయన కాన్సెప్ట్. కారణం ఆయనకున్న డబ్బులేనా అంటూ ఆయన ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జానారెడ్డే తన పదవిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. ఏమో అయి ఉండొచ్చు. జానారెడ్డి రంగారెడ్డి జిల్లాలో మల్ రెడ్డి రంగారెడ్డి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ చర్చ ఎలా ఉన్నా.. ఒకే కుటుంబంలో, ఒకే జిల్లాలో.. ఒకే సామాజికవర్గంలో ఎలా ఇస్తారనే ప్రశ్న గట్టిగానే వస్తోంది. ఇన్ని ఈక్వేషన్స్ అడ్డంగా వస్తున్నా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి కావాల్సిందేనంటున్నారు. అప్పుడు పీసీసీ పీఠం అయినా.. ఇప్పుడు మంత్రి పదవి అయినా.. తనకున్న ఆర్ధిక బలమే ఇప్పిస్తుందని ఆయన నమ్ముతున్నారని.. ప్రచారం జరుగుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Related Posts
Latest News
