24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
ఏలూరు : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్దించాలని కోరుతూ ఈనెల 24వ తేదీన ఏలూరు కార్మిక శాఖ కార్యాలయం జరిగే ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొనాలని ఏపీ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు ఓవర్ బ్రిడ్జి సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు నాయకులు అయినపర్తి మాధవ్ అధ్యక్షతన గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రమణారావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిర్మాణ కార్మికుల హక్కులు, చట్టాల్ని కాలరాస్తు విస్మరిస్తున్నారని ఆరోపించారు. గత ఆరేళ్లుగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు జరగకుండా ఇచ్చిన 1214 మెమో రద్దు చేసి సంక్షేమ బోర్డును పునర్దించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునర్దిస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీ 10 మాసాలైనా నెరవేర్చలేదని విమర్శించారు. కార్మికుల ఆందోళన, పోరాటాలతోనే సంక్షేమ చట్టాలు అమలు జరిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈనెల 24వ తేదీన జరిగే ధర్నాలో భవననిర్మాణ కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కందుల సంతోష్ ,బి.కుటుంబరావు, పరస చిన్నారావు, ఉండవల్లి బాబ్జి,తోటకూర రవి, బోకినాలు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.