నేడు హైఓల్టేజ్ తో ముంబై వర్సెస్ ఆర్సీబీ
ఐపీఎల్ 2025 లో భాగంగా ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై, బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం అంతగా ప్రభావం చూపించలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే అందుకొని పాయింట్స్ లిస్ట్ లో 8వ స్థానానికి పరిమితమైంది. చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యింది. ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీని ఘనంగా స్టార్ట్ చేశారు. కోల్కతా టీమ్, చెన్నై టీమ్ పై వరుస విజయాలు సాధించి జోరుమీదుంది. కానీ, సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఫెయిల్ అయ్యింది.
ఇక వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొత్త బంతితో పేసర్లు తమ హవా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఓపెనర్లు ఆచితూచి ఆడితే భారీ స్కోర్లు పక్కా. ఇక్కడ బౌండరీలు చిన్నగా ఉండటం, అవుట్ఫీల్డ్ వేగంగా ఉండటం బ్యాటర్లకు కలిసొచ్చే అంశాలు. ఐపీఎల్లో ఇప్పటివరకు వాంఖడేలో జరిగిన 119 మ్యాచ్ల్లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 171 పరుగులుగా నమోదైంది. కాగా ఛేజింగ్ కు దిగిన జట్లు 65 సార్లు విజయం సాధించగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 53 మ్యాచ్ల్లో గెలుపొందాయి.