నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు..!
హైదరాబాద్లో కోడిన్ ఆధారిత దగ్గు సిరప్స్ను దుర్వినియోగం కోసం అక్రమంగా మళ్లిస్తున్న నెట్వర్క్ను తెలంగాణ ఎక్సైజ్ శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో ఛేదించారు. ఈ ఆపరేషన్ రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు రామంతాపూర్ దగ్గర ఇద్దరు వ్యక్తుల నుంచి నిషేధిత గంజాయిని పట్టుకోవడంతో ప్రారంభమైంది. వీరిలో వైభవ్ కులకర్ణి, మనుపాటి భాను ప్రకాష్ ఉన్నారు. విచారణలో వీరు సికింద్రాబాద్ లాలాపేట్ ప్రాంతంలో ఒక మహిళ కోడిన్ ఫాస్ఫేట్ సిరప్ అమ్ముతోందని వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా, మౌలాలి బ్రిడ్జి సమీపంలో నిఘా పెట్టగా, ఒక మహిళ స్కూటరుపై 13 బాటిళ్ల కోడిన్ ఫాస్ఫేట్ సిరప్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆమెని నల్ల రజినీగా గుర్తించారు. ఆమె దగ్గర డ్రగ్ లైసెన్స్తోపాటు మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా లేవు. విచారణలో ఆమె ఈ మందులను జెనరిక్ వరల్డ్ మెడికల్ షాప్, విద్యానగర్, హైదరాబాద్ నుంచి తీసుకుందని తేలింది. దీంతో అధికారులు ఆ మెడికల్ షాపులో సోదాలు నిర్వహించగా.. ప్రిస్క్రిప్షన్ లేకుండా 3 బాటిళ్ల కోడిన్ సిరప్ను బిల్ ఇవ్వకుండా విక్రయించారు. ఆ తరువాత షాపులో తనిఖీ చేసి మొత్తం 80 బాటిళ్ల కోడిన్ ఫాస్ఫేట్ సిరప్స్ నిల్వలను గుర్తించారు.
తదుపరి విచారణలో.. ఆ మందులను హిమాలయ ఫార్మా, ఓల్డ్ బోయిన్పల్లి దగ్గరున్న ఓ ఫార్మసీ నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ ఫార్మసీని జెనరిక్ వరల్డ్ మెడికల్ షాప్ లైసెన్సుదారుని బంధువు నిర్వహిస్తున్నాడు. హిమాలయ ఫార్మసీలో దాడులు నిర్వహించగా, మందుల విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కోడిన్ సిరప్ సరఫరా వివరాలు లభించాయి. అక్కడ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా కోడిన్ సిరప్ విక్రయాలు, రికార్డుల నిర్వహణలో లోపాలు కనుగొన్నారు. ఇక ఈ కేసులో ఏ1గా నల్ల రజినీ, ఏ2గా అన్మోల్కుమార్ సింగాల్, ఏ3గా దినేశ్ కుమార్ గోయల్పై కేసు నమోదు చేశారు. జెనరిక్ వరల్డ్ మెడికల్ షాప్, విద్యానగర్ మరియు హిమాలయ ఫార్మా, ఓల్డ్ బోయిన్పల్లి మెడికల్ షాపుల డ్రగ్ లైసెన్సులు రద్దు చేశారు.