కలవరపెడుతున్న నక్షత్ర తాబేళ్ల మరణాలు..!
శ్రీకాకుళం TPN :
- శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృత్యుఘోష
- రెండు రోజుల్లో 15 జీవుల కన్నుమూత
- గుట్టుగా దహనం చేసేస్తున్న సిబ్బంది
శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఇక్కడ రెండు రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు, తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా.. సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారు. ఆదివారం ఉదయం మృతి చెందిన కొన్ని తాబేళ్లను అక్కడ పని చేసే ఓ వ్యక్తి శ్వేతపుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడకు వెళ్లి చూడగా ఏడు మృతి చెందిన తాబేళ్లు, కాలిపోయిన స్థితిలో మరో 9 తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.
పర్యవేక్షణ లోపమే కారణం!
కూర్మనాథ క్షేత్రం పార్కులో 187 వరకు నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను ఓ గుత్తేదారుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళంలో ఉండటం, స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో.. పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. నిబంధనల ప్రకారం మృత్యువాత పడిన తాబేళ్లకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయాలి. ఇవేమీ ఇక్కడ జరగకపోగా క్షేత్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా వాటిని దహనం చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయమై గుత్తేదారు రమణమూర్తిని వివరణ కోరగా ఆదివారం రెండు తాబేళ్లు మాత్రమే చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సిబ్బందితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటామని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ భద్రాజీ చెప్పారు.