ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్..?
40 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ సమయంలో మాజీ నక్సలైట్, ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, పలు దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములపై.. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కన్నేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆరోపించారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ భూములను స్వాధీనం చేసుకును ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. అలాంటి చర్యలు మానుకొని సాగుచేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. నక్సలైట్ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన దూసి అప్పలస్వామికి, మరో ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, మరో మూడు దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన నాలుగున్నర ఎకరాల భూమి పక్కన.. ఎమ్మెల్యే ఎంజీఆర్ భూమి కొనడం.. ఆ పక్కనే ఉన్న వీరి పొలాలు కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారం ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. ల్యాండ్ సీలింగ్లో పేదలకు భూములు ఇవ్వడం ప్రధాన ఉద్దేశమని, ఆ విధంగా వచ్చిన భూములను ఎమ్మెల్యే స్వాధీనపరుచుకోవాలని చూడడం సరికాదన్నారు. ఈ భూములపైనే గిరిజన, దళిత రైతులు జీవనం సాగిస్తున్నారని.. వారి సాగులో ఉన్న భూములకు హక్కులను కల్పించి, పాసు పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాటి అలాట్మెంట్ రికార్డుల్లో ఈ బాధిత రైతుల పేర్లే ఉన్నాయన్నారు. ఇప్పుడు అవి ఎవరివో తెలియాలంటే రికార్డులు పరిశీలించాలని.. కొత్త నాటకాలు ఆడడం అధికారులకు సమంజసం కాదని, ఈ విషయం మీద ఆర్డీవోని సంప్రదించడం జరిగిందని.. ఈ రైతులకు న్యాయం జరగకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు.