కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారామ్పూర్ గ్రామానికి చెందిన మహేందర్, ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తమ మామయ్య తెలుగు రాంబాబు పెళ్లి నిమిత్తం చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామానికి వచ్చారు. ఇంటి ఎదుట ఉన్న రాంబాబు కారులో ఇద్దరు పిల్లలు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఎక్కారు. బంధువులు, కుటుంబసభ్యులు ఇది గమనించలేదు. బయట ఎక్కడో ఆడుకుంటున్నారని భావించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారులో చూడగా.. ఆ ఇద్దరు చిన్నారులు స్పృహ తప్పి పడి ఉన్నారు. లాక్ తీసి చిన్నారులను కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆస్పత్రి ప్రాగణంలో ఆ పిల్లల తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.