మయన్మార్లో మరోసారి భూకంపం..
మయన్మార్ ను వరుస భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. గత నెల 28న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వేలాది మంది మరణించారు. ఆ ఘటన మరవకముందే మరోసారి సోమవారం ఉదయం మయన్మార్ లో గంటల తేడాతో రెండుసార్లు భూమి కంపించింది. ముందుగా సోమవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల సమయంలో 4.5 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అంటే ఉదయం 10:06కి మరోసారి భూమి కంపించింది. రిక్టరుస్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు ఎన్సీఎస్ వెల్లడించింది.
అయితే, స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక ఆదివారం ఉదయం కూడా మయన్మార్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. మాండలే నగరానికి దక్షిణాన 97 కిలోమీటర్ల దూరంలోని వుండ్విన్ పట్టణంలో ఆదివారం ఉదయం ప్రకంపనలు వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మయన్మార్ రాజధాని నేపిడా, రెండో పెద్ద నగరమైన మాండలే మధ్య ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.