గండిమైసమ్మ చౌరస్తాలో కళాజాతర: వందరోజుల ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమం
తడి చెత్త – పొడి చెత్తపై పాటల ద్వారా ప్రచారం, శుభ్రతపై ప్రజల్లో చైతన్యం
మేడ్చల్ జిల్లా, జూన్ 13:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికలో భాగంగా, “ఒక మార్పు అభివృద్ధికి మలుపు” అనే నినాదంతో దుండిగల్ మున్సిపల్ పరిధిలో గండిమైసమ్మ చౌరస్తాలో కళా జాతరను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ నేతృత్వం వహించారు. జిల్లా స్థాయి కళాకారుల బృందం తడి చెత్త, పొడి చెత్త పట్ల ప్రజల్లో అవగాహన కలిగించే పాటలు, ప్రదర్శనల ద్వారా సందేశాలు ఇచ్చింది. అదే విధంగా ప్లాస్టిక్ బ్యాన్, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై కూడా కళాత్మకంగా ప్రజల్లో చైతన్యం కలిగించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సురేందర్ నాయక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పి. సాత్విక్, వార్డు అధికారులతో పాటు మెప్మా మహిళా గ్రూపులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ప్రజల్లో శుభ్రతపై బాధ్యతతో కూడిన జీవనశైలిని అలవరచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని అధికారులు తెలిపారు.