మరో రెండు భారీ ప్రమాదాల నుండి గట్టెక్కించిన డయల్ 112
హైదరాబాద్:డయల్ 112 మరో రెండు భారీ ప్రమాదాల నుండి జనాల ప్రాణాలను రక్షించింది. ఉదయం హైదరాబాద్లో 3:30 గంటలకు, కరీంనగర్లో 3:51 గంటలకు రెండు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC), బంజారాహిల్స్, హైదరాబాద్ నుంచి నిర్వహించబడుతున్న డయల్ 112కి కాల్స్ వచ్చాయి.
మొదటి ఘటన హైదరాబాద్లోని మిధిలానగర్, బాచుపల్లి ప్రాంతంలోని హిల్టాప్ టవర్స్లో, రెండవ ఘటన కరీంనగర్లో గీతాభవన్ సమీపంలోని మాతృశ్రీ హోమియోకేర్ వద్ద జరిగింది. ఈ రెండు చోట్ల ఎయిర్ కండిషనర్లో జరిగిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అత్యవసర సమయంలో బాధితులు డయల్-112కి ఫోన్ చేసి సమాచారం అందించారు. అత్యవసర బృందాలు కొన్ని నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాచుపల్లిలో మంటలతో భయపడిన ఓ వ్యక్తి రెండవ అంతస్తు నుంచి దూకి గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిగతా జనాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కరీంనగర్లో ఎలాంటి గాయాలు సంభవించలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో అన్ని అత్యవసర విభాగాల తక్షణ స్పందన మరియు ప్రొఫెషనల్ వైఖరి డయల్-112 యొక్క కీలక పాత్రను మరోసారి నిరూపించింది. సమన్వయంతో పనిచేసే ఈ వ్యవస్థ ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో ఎంత ఉపయోగకరంగా ఉందో స్పష్టమైంది.
ఏసీ షార్ట్ సర్క్యూట్లు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచన
ఇటీవలి కాలంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ల కారణంగా తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో, TGiCCC డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ కండిషనర్లు, గీజర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సక్రమంగా నిర్వహించుకోవాలని, సర్క్యూట్లు ఓవర్లోడ్ అవకుండా చూసుకోవాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులలో డయల్-112 సేవలను భయపడకుండా వినియోగించండి
తక్షణ స్పందనతో మానవ ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించిన బృందాల ధైర్యాన్ని, నైపుణ్యాన్ని తెలంగాణ పోలీసులు కొనియాడారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులలోనైనా డయల్-112కి కాల్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశముందని, మీ కాల్ మీ ప్రాణాన్ని కాపాడవచ్చని చెప్పారు.