సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించారు. 'జయజయహే తెలంగాణ' రాష్ట్ర గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరిచయ కార్యక్రమంలో వివిధ దేశాల సుందరీమణులు తమ ప్రత్యేక దుస్తులలో ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితర ప్రముఖులు హాజరయ్యారు.