వైభవంగా చిలుకూరి బాలాజీ కళ్యాణం..!
చిలుకూరి బాలాజీ కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిలుకూరి ఆలయం గోవింద నామాలతో మారుమోగింది. అర్చకులు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. భక్తుల గోవింద నామస్మరణలు.. మంగళవాయిద్యాల మధ్య కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు శ్రీదేవీభూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని అర్చకులు రంగాచార్యులు కనులపండువగా నిర్వహించారు. ముందుగా శ్రీవారిని భక్తులు గోవింద నామస్మరణల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. ఆలయానికి సమీపంలో ఉన్న మండపంలో స్వామివారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లను కూడా ఊరేగింపుగా స్వామి వారి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి అద్దాలమహల్ ఎదుట ఏర్పాటు చేసిన పెళ్లిపందిరిలో కూర్చోబెట్టారు. స్వామివారి ఊరేగింపు ఎదుట చిన్నారుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి కల్యాణాన్ని రంగాచార్యుల ఆధ్వర్యంలో 25 మంది వేదపండితులు వైభవంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. కల్యాణ వేడుక సుమారు మూడు గంటలపాటు కనులపండువగా సాగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు రంగరాజన్, కన్నయ్యస్వామి, మురళి, నరసింహ, బాలాజీస్వామి, సుదర్శన్, సురేశ్స్వామి పాల్గొన్నారు.