రేపు మోడీ పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని మోడీ రేపు ఉత్తరప్రదేశ్లోని ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటన చేయనున్నారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక బహిరంగ సభలో 50 వేల మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉంది. శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల్లో 25 ప్రాజెక్టుల విలువ రూ.2,250 కోట్లు. నగరంలో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రధాన ఫోకస్ చేశారు.
కాగా ఇందులో 15 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 1,500 కి.మీ. కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు ఉన్నాయి. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందించే దిశగా చౌకాఘాట్ సమీపంలో కొత్త 220 కేవీ సబ్స్టేషన్ కూడా రానుంది. ఇక 130 తాగునీటి ప్రాజెక్టులు, 100 కొత్త అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పింద్రాలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రధాని ప్రారంభిస్తారని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు.