గిరిజనుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు: ఐటీడీఏ
గిరిజనుల వద్ద అధిక చార్జీలు వసూలు చేయకూడదని, నిబంధనలకు మించి అధిక చార్జీలు వసూలు చేసే ఆర్ఎంపీ డాక్టర్లపై తప్పకుండా చర్యలు
భద్రాచలం: మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు వివిధ టెస్టులు మరియు స్కానింగ్, ఎక్సరేలు తీయించుకోవడానికి ప్రైవేట్ ల్యాబ్ లకు పంపించడం వలన అర్హత లేని ల్యాబ్ అసిస్టెంట్లతో టెస్టులు చేయించి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, నిబంధనలకు మించి అధిక చార్జీలు వసూలు చేసే ఆర్ఎంపీ డాక్టర్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
సోమవారం నాడు సాయంత్రం ఐ టి డి ఏ సమావేశం మందిరంలో భద్రాచలంలోని ప్రైవేట్ డాక్టర్లతో మరియు ల్యాబ్ అసిస్టెంట్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలోని మార్మూల ఆదివాసి గిరిజన గ్రామాల నుండి ఎక్కువ శాతం నిరుపేదలైన గిరిజనులు ఏరియా ఆసుపత్రికి వస్తూ ఉంటారని వారికి వివిధ రకాల టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్ లకు వస్తూ ఉంటారని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అర్హత లేని ల్యాబ్ అసిస్టెంట్లకు వివిధ రకాల టెస్టులు చేసి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు వివిధ కథనాలు వినిపిస్తున్నాయని అందుకు ప్రైవేట్ ల్యాబ్ లు నిర్వహించేవారు గిరిజనుల నుండి మినిమం ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని అలాగే వివిధ రకాల టెస్టులకు మరియు ఐసీయూలో బెడ్ చార్జెస్, ఇతర రకాల టెస్టులకు సంబంధించిన బోర్డులు ఏ టెస్ట్ కి ఎంత చార్జీ వసూలు చేస్తారో రేట్ల ప్రకారం ల్యాబ్ ముందు డిస్ప్లే చేయాలని, అర్హత కలిగిన ల్యాబ్ అసిస్టెంట్లు మాత్రమే వివిధ రకాల టెస్టులు నిర్వహించేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహించే డాక్టర్లు బయో మెడికల్ వేస్ట్ మేటీరియల్ ప్రతిదీ డంపింగ్ యార్డులలో వేస్తున్నారని ఇకముందు అలా జరగకుండా చూడాలని, త్వరలో గ్రామపంచాయతీ అధికారులు, వైద్య శాఖ అధికారులతో ఒక బృందాన్ని సర్వే చేయడానికి నియమిస్తున్నామని, ప్రతి ఒక్కరు బయో మెడికల్ వేస్టేజ్ ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడబడితే అక్కడ వేయకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతివారం నర్సింగ్ పూర్తిచేసిన బాలికలు జీవనోపాధి కల్పించడానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నారని అర్హత ఉన్నవారికి మీ ఆసుపత్రులలో నియమించి వారికి జీవన భృతి కల్పించాలని ముఖ్యంగా పి వి టి జి గ్రామాలలో నర్సింగ్ శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఉన్నారని తప్పకుండా ప్రైవేట్ డాక్టర్లు వారికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్పత్రికి డెలివరీకి వచ్చే గర్భిణీలు కానీ పేషెంట్లు కానీ డాక్టర్లు చెప్పిందే వింటారని వారికి అర్థమయ్యే రీతిలో తగిన సూచనలు సలహాలు ఇచ్చి గర్భిణీలకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని, రోగులకు సరియైన వైద్య చికిత్సలు చేయాలని, ప్రస్తుతం భద్రాచలంలో 14 మంది ఆర్ఎంపీ డాక్టర్లు పనిచేస్తున్నారని, చర్ల మండలంలో అధికంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఆర్ఎంపీ డాక్టర్లు వారి తహతకు మించి వైద్యం చేయకూడదని, మీ దగ్గరకు వచ్చే గిరిజనుల వద్ద అధిక చార్జీలు వసూలు చేయకూడదని, నిబంధనలకు మించి అధిక చార్జీలు వసూలు చేసే ఆర్ఎంపీ డాక్టర్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్వో డాక్టర్ చైతన్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సుదర్శన్, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ స్పందన, ప్రోగ్రాం అధికారి రాము, ప్రైవేట్ ల్యాబ్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.