అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
- ముచ్చటగా వర్షిణీని మూడో పెళ్లి చేసుకున్న అఘోరీ
- ఆంధ్రాతో పాటు తెలంగాణలో అఘోరీపై కేసులు నమోదు
- శంకర్పల్లి, శామీర్పేటలో ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు
- అఘోరీ శ్రీనివాస్ కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు
- శ్రీనివాస్ను తెగ పాపులర్ చేసిన యూట్యూబర్స్
- సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
- ఆర్జీవీ ఓ సినిమా తీయాలంటూ నెటిజన్ల కోరిక
- అఘోరీ శ్రీనివాస్ కోసం కొందరు ప్రొడ్యూసర్ల వేట
అఘోరీ మాతా.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన పేరు.. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టా ఇలా ఏదీ ఓపెన్ చేసిన అంతటా అతని పేరు... సారీ మాత.. పేరే వినపడుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ అఘోరీ మాత అల్లూరి శ్రీనివాస్ కోసం వేట మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో మూడుచోట్ల కేసులు నమోదు కావడంతో పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అఘోరీని పట్టిస్తే నజరానా కూడా ప్రకటించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అఘోరీ హల్చల్పై ఓ కన్నేస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాంగోపాల్ వర్మకు తెలిస్తే ఓ సినిమా తీసేస్తాడు అంటూ నెట్టింట్లో నెటిజన్ల కామెంట్లు. ఆర్జీవి కంటే ముందుగా సినిమా తీయాలని కొందరు ప్రొడ్యూసర్లు పరుగులు పెడుతున్నట్లు సమాచారం. అంటే దీన్ని బట్టి శ్రీనివాస్ మాత ఎంత పాపులర్ అయ్యాడో తెలుస్తోంది కదా.
మంచిర్యాల జిల్లా, నన్నెల మండలం, కుషన్ పల్లి గ్రామానికి చెందిన అల్లూరి చిన్నయ్య, చిన్నక్కలకు అయిదుగురు సంతానం. నలుగురు కొడుకులు, ఒక కూతురు. మూడోవాడే ఈ అఘోరీ మాత శ్రీనివాస్. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో కుటుంబ పోషణ అంతలా సాగేది కాదు. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్ జాడ ఎక్కడ కానరాలేదు. అప్పుడప్పుడు మాత్రం వేములవాడలో కనపడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నాలుగు సంవత్సరాల కిందట ట్రాన్స్జెండర్గా మారి అఘోరీ అవతారమెత్తాడు అనేది ప్రచారం.
ఉన్నట్టుండి ఓ కారులో పుర్రెలతో రయ్మంటూ సికింద్రాబాద్ బేగంపేటలో దర్శనం ఇచ్చాడు. ముత్యాలమ్మ గుడి వివాదంలో దూరేసరికి అక్కడున్న జనం ఆయనను వింతగా చూడటం మొదలుపెట్టారు. సాధారణంగా అఘోరీ, నాగసాధువులను జనం చూడరు.. చూడలేరు. ఏ కాశీకి వెళ్తే తప్ప వారు కనిపించరు. అసలు వారు జనంలోకి కూడా రారు. ఈ అఘోరీ శ్రీనివాస్ మాతను జనం ఎగబడి చూసే సరికి .. ఇంకేముంది యూట్యూబర్స్ రంగంలోకి దిగారు. వ్యూస్ కోసం పాకులాడి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసి పాపులర్ చేశారు. అప్పటి వరకు పొలిటికల్, క్రైం న్యూస్తో తెగ బోర్ ఫీల్ అయిన జనం కూడా బాగా ఫాలో అయ్యారు. దీంతో యూ ట్యూబర్స్తోపాటు బడా ఛానల్స్ కూడా వెంటపడటం మొదలు పెట్టడంతో ఇంకేముంది సోషల్ మీడియాలో అడ్డుఅదుపు లేకుండా శ్రీనివాస్ మాత దర్శనం కోసం క్యూ కట్టారు జనం.
సనాతన ధర్మం కాపాడటానికే హిమాలయాల నుంచి వచ్చానంటూ చెప్పుకుంటూ పోతున్న అఘోరీ వెనుక ఫైనాన్సర్స్ ఎవరూ అనే ప్రశ్న కూడ తలెత్తింది. కారు.. హంగు.. ఆర్భాటం అంతా ఇంతా కాదు.. ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు అంటే కొంత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రలో రచ్చరచ్చ చేసిన శ్రీనివాస్ ఆగడాలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా పూజల పేరుతో లక్షల రూపాయలు దోచుకున్నాడు అంటూ ఫిర్యాదులు కూడా అందాయి. శామీర్పేటలో సంధ్య తాను మొదటి భాార్యను అని, రాధిక అనే మహిళ తాను రెండో వైఫ్ని అని కంప్లైంట్ చేశారు. మూడోసారి వర్షిణీ అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
వర్షిణీ పెళ్లితో మరోసారి అఘోరీ సోషల్ మీడియా ఆన్లైన్లోకి వచ్చాడు. అతడి ఆగడాలపై నెటిజన్లు బాగానే కామెంట్లు చేశారు. తన్ని తరిమేయాలంటూ కొందరు పోస్టులు పెడితే.. వర్షిణీని అతీత శక్తుల కోసం బలివ్వడానికే పెళ్లి చేసుకున్నాడంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. తాజాగా రంగారెడ్డిజిల్లా శంకర్పల్లి పోలీసు స్టేషన్లో కూడా ఓ ప్రొడ్యూసర్ సోదరి ఫిర్యాదు చేసింది. మోనీ పూజ అని చెప్పి తన దగ్గర అఘోరీ శ్రీనివాస్ మాత పది లక్షలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా తెలంగాణ స్టేట్లో అనేక ఫిర్యాదులు అందడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడ సీరియస్ అయినట్లు సమాచారం.
దీంతో శ్రీనివాస్కి చెక్ పెట్టేందుకు నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. మధ్యప్రదేశ్లో వర్షిణీని పెళ్లి చేసుకొని పరారీలో ఉన్న అతని కోసం వేట మొదలు పెట్టారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చిన టవర్ లోకేషన్ ద్వారా కనిపెట్టాలని, అలాగే అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులు, యూట్యూబర్స్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. యూట్యూబర్స్తో తెగ టచ్లో ఉన్న నేపథ్యంలో వారిని పట్టుకుంటే అఘోరీ దొరికినట్లే అని పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనా శ్రీనివాస్ బయోగ్రఫి చూస్తే పెద్దగానే ఉంది. ఆయన జీవిత చరిత్రపై ఆర్జీవి ఓ సినిమా తీస్తే బాగుండు అంటూ నెటిజన్లు కోరుతున్నారు. మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్లో తెగ వీడియోలు.. లక్షల్లో నెటిజన్ల కామెంట్లు చూసి కొందరు ప్రొడ్యూసర్లు ఆర్జీవి కంటే ముందుగా సినిమా తీసి హిట్ కొట్టాలని ఆశపడుతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.