ఐపీఎల్ లో మళ్లీ ఫిక్సింగ్?
ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్ లన్నీ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. క్రికెట్ లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది తాజాగా ఈ లీగ్ లో బీసీసీఐ చేసిన వార్నింగ్ షాక్ కి గురి చేస్తుంది. ఐపీఎల్ కు ఫిక్సింగ్ డేంజర్ ఉందంటూ ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారమిచ్చిందన్న వార్త ట్రెండ్ అవుతుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని బీసీసీఐ అనుమానిస్తోంది. ఈమేరకు అతడు వ్యక్తులను ప్రలోభపెడుతున్నాడని, దాంతో జాగ్రత్తగా ఉండాలని పది ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులను బీసీసీఐ లెటర్స్ ద్వారా హెచ్చరించింది.
అలాగే క్రికెటర్లు, కోచ్లు, సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలను కూడా బోర్డు అప్రమత్తం చేసింది. సదరు వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నట్టు బీసీసీఐ అవినీతి వ్యతిరేక, భద్రతా విభాగం గుర్తించింది. గతంలో బెట్టింగ్లు, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసిన అనుభవం ఉన్న ఆ వ్యాపారవేత్త.. ఈమారు ఐపీఎల్ జట్లు బస చేస్తున్న హోటళ్లలో, మ్యాచ్లు జరిగే స్టేడియాల్లో కనిపించాడని ఫ్రాంచైజీలకు రాసిన లెటర్ లో పేర్కొంది. అయితే, అతను ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదట. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అతను ఆటగాళ్లకు చేరువయ్యే ప్రమాదం లేకపోలేదని, ఈ క్రమంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.