కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్ కార్ఖాన పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడం గమనించిన స్థానికులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో నివాసముంటున్న వీణ, మీనాల ప్లాట్ని పోలీసులు తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో హాల్లోని మంచంపై వారి మృతదేహాల్ని గుర్తించారు. వెంటనే వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వీణ(60), వాణి(59) అక్కాచెల్లెళ్లు 12 ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఓకే ఫ్లాట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. వీణ, మీనాలు తన చెల్లెలు సాధనతో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారని.. పది రోజుల క్రితం చివరగా ఫోన్ చేసినట్లు తెలిపారు. వీరి కుటుంబంలో ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా.. వారిలో ఇద్దరు ఇదివరకు మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరి తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందినట్లు చెప్పారు. ఇకపోతే.. అపార్ట్మెంట్ వాసులతో మీనా, వాణి సరిగా మాట్లాడేవారు కాదని.. వారి మానసిక స్థితి కూడా సరిగా ఉండేది కాదన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.