సెల్ఫోన్స్ చోరీ ముఠాలు అరెస్ట్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్, బాలానగర్, మేడ్చల్ జోన్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు జోన్ల పరిధిలో మొత్తం 1060 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్గా చేసుకొని సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్స్ను సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఎల్సీ నాయక్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం ఐదు టీమ్స్ పగలు, రాత్రి కష్టపడి సెల్ఫోన్లను రికవరీ చేశారని చెప్పారు. ఫోన్ పోగొట్టుకున్న బాధ బాధితులకు మాత్రమే తెలుస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలు సెల్ఫోన్ పోగొట్టుకొని నలిగిపోతున్నాయని.. సెల్ఫోన్ పోతే ఎలా రిపోర్ట్ చేయాలో కూడా ఎవరికి తెలియడం లేదన్నారు. సీఈఐఆర్ పోర్టల్ను కేంద్రం ఆధునీకరించిందని చెప్పారు. ఇప్పటి వరకు 9505 ఫోన్లను అన్ బ్లాక్ చేశామని.. 3 కోట్ల 18 లక్షల రూపాయల విలువైన సెల్ఫోన్లను రీకవరీ చేశామన్నారు. నిత్యావసర వస్తువులలో సెల్ఫోన్ ఒకటిగా మారిపోయిందని.. కాబట్టి సెల్ఫోన్లను జాగ్రత్తగా చూసుకోవాలి సూచించారు.