తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్...
మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాకుళం స్థానిక సిపిఐ పార్టీ ఆఫీసులో జాతీయ మహాసభలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుండి జాతీయ మహాసభలో యువత పాల్గొంటారని, 29 రాష్ట్రాల నుండి జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా హాజరవుతారని అన్నారు. మే 15వ తేదీ వేలాదిమంది యువతతో ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా మే 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మాటను గాలికొదేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య ను పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ద్వారా దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. యువజన హక్కుల సాధనకై ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వాసు, క్రాంతి, హరి తదితరులు పాల్గొన్నారు.