అమిత్ షాపై బెంగాల్ సీఎం మండిపాటు..
కేంద్ర హోంమంత్రి అమిత్షాపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ చట్టం 2025 కు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హస్తం ఉందని మండిపడ్డారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని మండిపడ్డారు. అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని, బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారని కామెంట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మమత మండిపడ్డారు.
కాబట్టి ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ.. అమిత్ షాను కంట్రోల్ చేయాలని సూచించారు. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు తమకు తెలిపాయని చెప్పారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను బెంగాల్లో జరుగుతున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మమత ఆరోపించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని అన్నారు. దీనిపై ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ఆమె కోరారు.