ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..!
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు చంపుతామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. నరకం అంటే ఏమిటో చూపిస్తానంటూ విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్పై చంద్రకిరణ్రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్డునంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో విజయశాంతి, శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఎం చంద్రకిరణ్రెడ్డి అనే వ్యక్తి, విజయశాంతి దంపతుల ఇంటికి వచ్చి తాను సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటానని.. ఎవరినైనా సరే సోషల్ మీడియా ద్వారా అగ్రస్థానంలోకి తీసుకువెళ్తానని నమ్మించాడు. తాను చేసే సోషల్ మీడియా ప్రచారం ద్వారా చాలా మంది ప్రముఖులుగా చెలామణి అవుతున్నారని, పలువురు సెలబ్రిటీలకు కూడా తానే కంటెంట్ ఇస్తుంటానని, విస్తృతంగా ప్రచారం చేస్తుంటానని, అలాగే విజయశాంతిని కూడా అగ్రస్థానంలో నిలబెడతానని చెప్పాడు. దీంతో విజయశాంతి ఆ మాటలు నమ్మి చంద్రకిరణ్రెడ్డికి సోషల్ మీడియా పేజీ బాధ్యతలు అప్పగించారు. అయితే అతను ఏనాడూ విజయశాంతిని సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకువెళ్లలేదు. విజయశాంతి పేరు వాడుకుంటూ ఇతరులకు ప్రచారం చేయసాగాడు. ఈ విషయం గమనించిన శ్రీనివాస్ ప్రసాద్.. మీ సేవలు వద్దు.. ఇక చాలు అంటూ అయన్ని పక్కన పెట్టేశారు. ఇటీవల చంద్రకిరణ్రెడ్డి వీరికి వాట్సాప్ ద్వారా ఓ మెసేజ్ పంపి, తనకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలంటూ కోరాడు. దీంతో విజయశాంతి దంపతులు షాక్కు గురయ్యారు. తమకెప్పుడూ సోషల్ మీడియా సేవలు అందించకపోగా డబ్బులు ఇవ్వాలంటూ కోరడాన్ని వారు తప్పుబట్టారు. ఈ క్రమంలో చంద్రకిరణ్ రెడ్డి మరో మెసేజ్ పంపుతూ.. "మీరు నాకు శత్రువులతో సమానం.. రేపు 4 గంటల నుంచి మీకు నరకం అంటే ఏమిటో చూపిస్తాను.. మీకు నిద్ర లేకుండా చేస్తాను" అంటూ పోస్ట్ చేశాడు. అలాగే మీ అంతు చూస్తానంటూ కూడా బెదిరించాడు. దీంతో విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు చంద్రకిరణ్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.