త్వరలోనే బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు – “ప్రజలకు న్యాయం చేస్తాను” అని హామీ.
- బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన దేశానికి తిరిగి వస్తానని ప్రకటించారు.
- యూనస్ను తీవ్రంగా విమర్శిస్తూ తన బాధలను గుర్తు చేసుకున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో జరిగిన సంభాషణ సందర్భంగా ఈ విషయం తెలియజేసింది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పై తీవ్ర విమర్శలు చేసింది. యూనస్ కు ప్రజల మీద ప్రేమ లేదు.. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపి వచ్చారని పేర్కొనింది. ఆ సమయంలో ఆయన తీరును తాము అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పుకొచ్చింది. అతడికి దేశం ఎంతో సహాయం చేసిందన్నారు.
నేను త్వరలోనే బంగ్లాదేశ్కు తిరిగి వస్తాను అని షేక్ హసీనా భరోసా ఇచ్చారు. అయితే, మహమ్మద్ యూనస్ నిర్ణయాలతో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని షేక్ హసీనా తెలిపింది. అలాగే, తన కుటుంబం మొత్తం హత్యలకు గురైన సంఘటనలను షేక్ హసీనా గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు.. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరందరూ ఎంత బాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసు అని పేర్కొన్నారు. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు.. అందుకే నన్ను ఆ అల్లా ఇంకా రక్షిస్తున్నాడు.. నేను తిరిగి వచ్చిన తర్వాత అందరికి న్యాయం చేస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా హామీ ఇచ్చింది.