అజాత శత్రువు, ప్రజా నాయకుడు శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు
• దుద్దిళ్ళ శ్రీపాద రావు గారు మార్చి 02, 1937న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా, ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీ రాధాకృష్ణయ్య, శ్రీమతి కమలాబాయి దంపతులకు నాగపూర్ లోని అమ్మమ్మ గారింట్లో జన్మించారు.
• వారు తన ప్రాథమిక విద్యను ధన్వాడ గ్రామంలో ప్రారంభించారు. ఉన్నత పాఠశాల విద్యను మంథనిలో పూర్తి చేసారు. అక్కడ వారు తన బావ శ్రీ సువర్ణ చంటయ్య గారి ఇంటిలో ఉన్నారు.
• 1953 లో వారు తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయడానికి హైదరాబాద్ కు వెళ్లి బిఎస్సీ బ్యాచిలర్ డిగ్రీని పొందారు, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు, అక్కడ వారు తన LLBలో బంగారు పతకాన్ని సాధించారు.
• తండ్రి మరణానంతరం LLM చదువును మధ్యలో వదిలిపెట్టి, ధన్వాడలో కుటుంబ వృత్తి వ్యవసాయాన్ని చెపట్టడానికి తిరిగివచ్చారు, 1957 ఫిబ్రవరి 19న మంథనిలో జయశ్రీతో వివాహం జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజలు, ముఖ్యంగా యువత శ్రీపాదరావు గారి వైపు మొగ్గు చూపారు. వారి సొంత ఊరైన ధన్వాడకు సర్పంచ్ గా ప్రాతినిధ్యం వహించడానికి 1964లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
• 1983లో తొలిసారిగా మంథని ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత మరో 2 పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు,
• 1989లో అజాత శత్రువు శ్రీపాద రావు శాసనసభ సభాపతి గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడము వారికి దక్కిన అరుదైన గౌరవం.
• 1964 నుంచి 1999 ఏప్రిల్ 13 న అకాల మరణం వరకు శ్రీపాదరావు మంథని ప్రజల అభ్యున్నతికి కృషి చేశారు.
• దుద్దిళ్ళ శ్రీపాద రావు విశిష్ట రాజకీయ వారసత్వాన్ని వారి తనయుడు, ప్రస్తుత తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు తీసుకువెళుతున్నారు.