ఉన్న గూడు పోయింది.. అద్దె ఇల్లే దిక్కయింది..
- రాష్ట్రంలో సగానికిపైగా అసంపూర్తిగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
ఇంటి తాళాలు ఇప్పిస్తామని నట్టేట ముంచిన నేతలు
సొంతింటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బాధితులు
By. V. Krishna Kumar
Tpn: స్పెషల్ డెస్క్..
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు.. పేరు వేరైనా.. ఆలోచన ఒక్కటే.. పేదింటి వాళ్లకు సొంత ఇల్లు అందించాలనే లక్ష్యం. ఈ లక్ష్యం కొందరికి ఆనందాన్ని ఇస్తే మరికొందరికి నిరాశ, నిస్పృహ.. ఎదురు చూపులు, కన్నీళ్లు ఇవే మిగిలాయి. ఉన్న గూడు చెదిరిపోయి రావలసిన అవకాశం రాక ఇంటి అద్దెలు చెల్లించలేక నానా సతమతం అవుతున్నారు. కొందరు అప్పులపాలై రోడ్డున పడుతున్నారు. ఇంటి అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఇదే అదనుగా భావించిన కొందరు నేతలు పేదల ఎదురుచూపులతో వ్యాపారం చేసి అందనంత దోచుకొని పారిపోతున్నారు. అచ్చం అలాగే జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ ప్రాంతంలో. గత ప్రభుత్వ బిఆర్ఎస్ హయాంలో మీర్పేట్ రైతు బజార్ ఎదురుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అంటూ 40గజాల పట్టా స్థలంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. సొంత ఇల్లు వస్తుందని చాలా మంది ఖాళీ చేసి అద్దెకు వుంటున్నారు. ఇందులో సగం పూర్తి చేసి అయిన వారికి కాకుండా మొక్కుబడిగా లాటరీ సిస్టం అంటూ కొందరు నాయకులు తమ వారికి వచ్చేలా చేశారు అనే ఆరోపణలు అనేకం. ఇక అసంపూర్తిగా ఉన్న మిగతా ఇండ్లను కూడా పూర్తి చేసి ఈ సారి ఖచ్చితంగా లబ్ధిదారులకు ఇస్తామని మాట ఇచ్చి మరిచారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్లు అనేసరికి చాలా మంది బాధితులకు మరోసారి ఆశ కలిగింది. అయితే సగంలో ఆగిపోయిన ఇండ్ల వైపు ఏ అధికారి కన్నెత్తి చూడలేదు. అవి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినవి కాబట్టి పూర్తి చేసినా వారికే పేరు వస్తుంది అనుకున్నారేమో మంత్రి వర్గం వాటి వైపు చూడకపోవడం ఆదిలోనే శిథిలావస్థకు చేరడం, కొన్ని సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా మారిపోయాయి. వీటిపై ఇటీవల అధికారులు గ్రామ సభ అంటూ పెట్టి కొందరి పేర్లు ప్రకటించారు. ఇండ్ల మంజూరు అంటూ కొందరికి ఓ పత్రం కూడా ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఇండ్లు మాత్రం రాలేదు.
ఇదిలావుంటే స్థానికంగా కొందరు నేతలు బాధితులకు అసంపూర్తిగా వుండే ఇల్లు అధికారులతో మాట్లాడి ఇప్పిస్తామని మిగతా సగం మీరే పూర్తి చేసుకోవాలని చెప్పడంతో సరే అని వందల మంది రూ. 50 వేల నుండి లక్ష రూపాయలు ముడుపుల రూపంలో అప్పు తెచ్చి మరీ ఇచ్చారు. మాయ మాటలతో లక్షలు వసూలు చేసిన గల్లీ లీడర్లు ఇంకేముంది డబ్బు తీసుకొని మొహం చాటేశారు. ఉన్న డబ్బుపోయి ఇల్లు రాక, అప్పులు తీర్చలేని బాధితులు తిరగబడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇంట్లోకి చొరబడి న్యాయం కోసం పోరాటం చేశారు. అయితే ఇల్లన్న ఇవ్వండి లేదా మా పట్టా మాకు ఇవ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు, అధికారులు ఎంట్రీ ఇచ్చి వారికి నచ్చచెప్పారు.
వాస్తవానికి కేవలం ఒక్క మహేశ్వరంలోనే కాదు సిటీ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఇలా అంతటా ఇలాంటి బాధితులే వున్నారు. ప్రభుత్వం స్పందించి జనాలను మోసం చేసిన నాయకులపై చర్యలు తీసుకోవడమే కాదు.. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి తమకు అందించాలని కోరుతున్నారు. వేలల్లో ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని, నాలుగు ఇండ్లల్లో పాచి పని చేసుకొని బ్రతికే తమకు తిరిగి ఓ గూడు అందించాలని కోరుతున్నారు.